News

బంగ్లాదేశ్ లో దుశ్చర్య : శక్తిపీఠంలో ప్రధాని మోదీ కానుకగా అందజేసిన కిరీటం చోరీ

264views

బంగ్లాదేశ్ లోని ప్రఖ్యాత శక్తిపీఠంలో చోరీ జరిగింది. దుండగులు అమ్మవారికి చెందిన కిరీటీన్ని ఎత్తుకెళ్లారు. ఈ కిరీటాన్ని ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళినప్పడు అమ్మవారికి కానుకగా అందజేశారు. ఆయనే స్వయంగా కాళీమాతకు అలంకరించారు.
స‌త్కిరాలోని జెషోరేశ్వ‌రీ ఆల‌యంలో వేంచేసిన కాళికాదేవికి ప్ర‌ధాని మోదీ బంగారు పూత పూసిన వెండి కిరీటాన్ని అందజేశారు. 51 శక్తిపీఠాల్లో జెషరేశ్వరీ ఆలయం కూడా ఒకటి. ప్రధాని మోదీ 2021 మార్చిలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ కిరీటాన్ని బ‌హూక‌రించారు.

అక్టోబర్ 10న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి 2.30 నిమిషాల మ‌ధ్య చోరీ జరిగినట్లు ఆలయ పూజారి తెలిపారు. దొంగ‌ను ప‌ట్టుకునేందుకు సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్లు ఇన్‌స్పెక్ట‌ర్ తైజుల్ ఇస్లామ్ తెలిపారు.

స‌త్కిరాలోని ఈశ్వ‌రిపుర్‌లో జెషోరేశ్వరీ దేవి ఆల‌యం ఉంది. ఆ ఆలయాన్ని అనారీ అనే బ్రాహ్మ‌ణుడు 12వ శ‌తాబ్ధంలో నిర్మించగా, 13వ శ‌తాబ్ధంలో ల‌క్ష్మ‌ణ్ సేన్ పున‌ర్ నిర్మించారు.
చోరీ ఘటన పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దొంగను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భారతవిదేశాంగ శాఖ కూడా ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది.