News

తిరుపతి లడ్డూ వివాదం : మూడు బృందాలుగా సిట్ విచారణ

18views

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తుబృందం( సిట్) విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా తిరుపతిలోని పోలీస్ గెస్ట్‌హౌస్ లో సిట్ సభ్యులు సమావేశం అయ్యారు. గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో సిట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి విచారణ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్థన్ రాజు, అడిషనల్ ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు సాగుతోంది.

టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన సిట్ టీమ్, టీటీడీ బోర్డు దగ్గర్నుంచి, ఇతర అధికారులు, సిబ్బంది పాత్ర వరకు సమగ్రంగా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. తమిళనాడులోని దుండిగల్ వెళ్లి, టీటీడీకి నెయ్యి సరఫరా చేసి ఏఆర్ ఫుడ్స్ సంస్థను కూడా పరిశీలించనుంది.

తిరుమలలోని లడ్డూ పోటు, అమ్మకాలు, లడ్డూ తయారీకి ఉపయోగించే ముడిసరుకులను పరిశీలించనుంది. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను కూడా సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మరో బృందం టీటీడీ పరిపాలనా భవనంలో దర్యాప్తు చేస్తోంది. నెయ్యి కొనుగోలు, సరఫరా అంశాల్లో టీటీడీ, ఏఆర్ ఫుడ్స్ డెయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించింది.