ArticlesNews

భారత రాకెట్‌ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆద్యులు సతీష్‌ ధవన్‌

12views

( సెప్టెంబర్‌ 25 – సతీష్‌ ధవన్‌ జయంతి )

భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఫ్రొఫెసర్‌ సతీష్‌ ధవన్‌ది సువర్ణ అధ్యాయం. ఎందుకుంటే ఆయన నెలకు ఒక్క రూపాయి జీతం తీసుకుని ఇస్రోలో పనిచేసి ఈ దేశానికి ఉపగ్రహాల సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చిన వారిలో అగ్రగణ్యులు. ఇస్రో తొలినాళ్లలో చిన్న తరహా రాకెట్‌ ప్రయోగాలకు పరిమితమైంది. భవిష్యత్‌లో పెద్ద పెద్ద ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెట్టి దేశ ప్రజలకు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని ఆయన అనుక్షణం పరితపించే వారు. భారత తొలి అంతరిక్ష పితామహుడు విక్రమ్‌సారాభాయ్‌ అయితే, ఆయన కన్న కలలను సాకారం చేసింది మాత్రం ఫ్రొఫెసర్‌ సతీష ధవన్‌. భారీ రాకెట్‌లు, ఉపగ్రహాలు తయారు చేసుకుని గ్రహాంతర ప్రయోగాలే చేసే స్థాయికి ఎగిగి నేడు ప్రంపంచంలో రెండు మూడు స్థానాల్లో ఉన్నామంటే అందులో సతీష్‌ ధవన్‌ వేసిన పునాదులే కారణం. 1975 ఆగస్టు 1 నుంచి 1976 జులై 31 వరకు ప్రయోగించిన సమాచార ఉపగ్రహాలతో ఆరు రాష్ట్రాల్లో 2,400 గ్రామాలను అనుసంధానించి టెలివిజన్‌ ద్వారా దూరవిద్యా సదుపాయాన్ని (టెలీ ఎడ్యుకేషన్‌) ఆనాడే కల్పించగలిగారు. ఈ అనుభవం భారత జాతీయ సమాచార ఉపగ్రహ వ్యవస్థకు ఎంతో దోహదపడి సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కారణమైంది. ఆనాడు సతీష్‌ ధవన్‌ వైమానిక శాస్త్రవేత్తగా అటు వైమానిక శాస్త్రరంగానికి, ఇటు అంతరిక్ష పరిశోధనా ప్రగతికి ఎనలేని సేవలందించారు. ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టినవే పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లు. ఈ రెండు రాకెట్‌లను తయారు చేయడానికి ఆయన ఆధ్యర్యంలో ఎన్నో పరీక్షలు చేసి విజయాలు సాధించారు. నేడు పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిందంటే అది ఫ్రొఫెసర్‌ సతీష్‌ ధవన్‌ చేసిన కృషి ఫలితమేనని సగర్వంగా చెప్పవచ్చు.

వరించిన అవార్డులు
1981లో పద్మవిభూషణ్‌ అవార్డు, ఇందిరాగాంధీ అవార్డు రెండు సార్లు, ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ సైన్స్‌ అవార్డు, కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్‌ టెక్నాలజీ వారు ఇచ్చిన అవార్డులను ఆయన పొందారు. ఆయన హయాంలో ఇందిరాగాంధీ, ఐకే గుజ్రాల్‌, అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ ప్రధానమంత్రులుగా షార్‌కు విచ్చేసి ప్రయోగాలను వీక్షించారు. ఇండియన్‌ మిసైల్‌ మ్యాన్‌, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం కూడా ఆయన ఆధ్వర్యంలో ఇస్రో తొలి ఫ్రయోగానికి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

మహనీయుని చరిత్ర ఇదీ..
శ్రీనగర్‌లో 1920 సెప్టెంబర్‌ 25న సతీష్‌ ధవన్‌ జన్మించారు. విద్యార్థిగా అత్యంత ప్రజ్ఙాపాటవాలను ప్రదర్శించి గణితం, భౌతికశాస్త్రంలో బీఏ వరకు చదివారు. అనంతరం ఎంఏలో ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చేశారు. తర్వాత మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టుభద్రులై, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి వైమానిక శాస్త్రంలో, గణితంలో పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ పొందారు.1951లో స్వదేశానికి విచ్చేసిన వెంటనే బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌లో అధ్యాపకుడిగా చేరారు. అనతి కాలంలోనే ఆచార్య పదోన్నతి పొందారు. 1962లో ఆ సంస్థకు డైరెక్టర్‌ అయ్యారు. 1972లో అంతరిక్ష పితామహుడు డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ మరణానంతరం ఇస్రోను ముందుకు నడపగలిగిన వ్యక్తిగా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆ బాధ్యతలను ధవన్‌కు అప్పగించారు. బెంగళూరు ఐఐటీకి డైరెక్టర్‌గా కొనసాగుతూనే ఇస్రో ఛైర్మన్‌ బాధ్యతలు నిర్వహిస్తూ నెలకు ఒక్క రూపాయి జీతంగా తీసుకున్న గొప్పవ్యక్తిగా ఆయన గురించి ఈనాటికి చెప్పుకోవడం విశేషం. సమాచార వ్యవస్థ, వాతావరణ పరిశోధన, భూమిలోని ఖనిజసంపద ఉనికిని తెలుసుకోవడం కోసం బహుళ ప్రయోజనాలకై సొంతంగా ఉపగ్రహాలను తయారుచేసి ప్రయోగించాలనే డాక్టర్‌ విక్రమ్‌సారాభాయ్‌ కన్నకలలను ధవన్‌ నిజం చేశారు. ఇస్రో ఛైర్మన్‌ అయిన అనతికాలంలోనే ఆర్యభట్ట, భాస్కర, యాపిల్‌ ఉపగ్రహాలను నిర్మించి ఎస్‌ఎల్‌వీ ఉపగ్రహ వాహకనౌక ద్వారా ప్రయోగించ గలిగారు. ఇన్‌శాట్‌, ఐఆర్‌ఎస్‌, తరహ ఉపగ్రహాల నిర్మాణ ప్రణాళికలు తయారు చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా యాత్రలో ఆయన శకం ముఖ్యమైన మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు. వయోభారంతో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన అంతరిక్ష రంగానికి విశేష సేవలు అందించారు. ఆ మహానుభావుడి పేరును మరిచిపోకుండా శ్రీహరికోట రాకెట్‌కేంద్రానికి 2002 సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌గా నామకరణం చేసి ఇస్రో ఘనమైన నివాళిని ఆయనకు సమర్పించింది. షార్‌లోని రెండోగేటుకు అవతల వైపున సతీష్‌ధవన్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేసి దానికి సతీష్‌ ధవన్‌ మెమోరియల్‌గా నామకరణం చేసి ఆయన పట్ల భక్తిభావాన్ని చాటుకుంది.