News

శ్రీవారి లడ్డూ పై టీటీడీ కీలక ప్రకటన

32views

శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు తితిదే ఈవో శ్యామలరావు తెలిపారు. ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం ఈవో, ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేసినట్లు ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. స్వామి వారికి మహా నైవేద్యం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లో ప్రోక్షణ చేస్తున్నామన్నారు. దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. చివరిగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని తెలిపారు. భక్తులెవరూ ఆందోళన చెందవద్దన్నారు.

‘‘ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశాం. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాం. లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలొద్దు. పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం.. పవిత్రోత్సవాలతో పోయింది. మార్చిన నెయ్యితోనే ఆ తర్వాత ప్రసాదాలు తయారుచేశాం. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతిహోమం, ప్రోక్షణతో తొలగుతాయి’’ అని వేణుగోపాల దీక్షితులు అన్నారు.