News

ఎల్‌ఓసీలోకి చొరబాటుదారులు.. కొనసాగుతున్న సెర్చ్‌ ఆపరేషన్‌

57views

గత కొంతకాలంగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జమ్ములోని పాలన్‌వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి.

భద్రతా దళాలకు నలుగురు చొరబాటుదారుల కదలిక కనిపించింది. దీంతో బలగాలు రాత్రిపూట లైట్లతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్‌ ఆపరేషన్ ప్రారంభించాయి. డ్రోన్ల ద్వారా నిఘాను కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో అడవులు, కొండలు ఉండడంతో సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహించేందుకు భద్రతా సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

ఆర్టికల్ 370 రద్దుకు అయిదవ వార్షికోత్సవం దృష్ట్యా, ఖౌడ్, జ్యోడియన్ ప్రాంతాల్లో సైన్యం, పోలీసులు ఇప్పటికే నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ ప్రాంతంలోని చెక్‌పోస్టుల వద్ద భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచారు ఆ ప్రాంతానికి వచ్చిపోయే ప్రతి వ్యక్తిని తనిఖీ చేస్తున్నారు.

మరోవైపు సరిహద్దు భద్రతా దళం తాజాగా ఒక పాక్ చొరబాటుదారుడి మృతదేహాన్ని పాక్ రేంజర్స్‌కు అప్పగించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడిని పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ముహమ్మద్ అఫియల్‌గా గుర్తించారు. అతని మృతదేహాన్ని సుచేత్‌గఢ్ సెక్టార్‌లోని ఆక్ట్రాయ్ పోస్ట్‌లో పాకిస్తాన్ రేంజర్స్‌కు అప్పగించారు.