
కాకినాడ జిల్లా ఏపీఎస్ ఆర్టీసీ రావులపాలెం డిపో నుంచి రామేశ్వరం తీర్థ యాత్రల ప్రత్యేక బస్ సర్వీస్ ఈ నెల 17న బయలు దేరుతుందని ఆ డిపో మేనేజర్ కేడీఎంఎస్ కుమార్ తెలిపారు. శనివారం కొత్తపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామేశ్వరం తీర్థయాత్రల విశిష్టత, దర్శనం నిమిత్తం భక్తుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని పుష్ బ్యాక్ 2 ప్లస్ 2 సిటింగ్ గల సూపర్ లగ్జరీ బస్ ఏర్పాటు చేశామన్నారు. 17న రావులపాలెం కాంప్లెక్స్లో బస్సు బయలుదేరి 24న తిరిగి వస్తుందన్నారు. ఏడు రోజుల తీర్థయాత్రలో కాణిపాకం, శ్రీపురం, అరుణాచలం, శ్రీరంగం, జంబుకేశ్వరం, పళని, కోయంబత్తూరు (ఈశా ఫౌండేషన్), మధురై, రామేశ్వరం, ధనుష్కోడి, తంజావూరు, కాంచిపురం, శ్రీకాళహస్తి, విజయవాడ దేవాలయాల దర్శనం చేయిస్తారన్నారు. టిక్కెట్ చార్జి ఒకరికి రూ.8,500 (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి టిఫిన్తో సహా) ఉంటుంది. రూమ్ అద్దెలు యాత్రికులే భరించాలని తెలిపారు. యాత్రలకు వచ్చే ప్రయాణికులు అసిస్టెంట్ మేనేజర్ 73829 11871, ఆర్ఎస్ రావు 73829 12398, వీరభద్రరావు 73829 12400 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.





