News

ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు.. సైన్యం అప్రమత్తం

60views

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇవాళ ‘ఏకాత్మ మహోత్సవ్‌’ ర్యాలీని నిర్వహిస్తుండగా కాంగ్రెస్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ సహా ప్రతిపక్ష కూటమి ఆగస్టు 5ను బ్లాక్‌ డేగా పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరోవైపు గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రఘటనలు పెరిగిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం కూడా అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ఆ ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించింది. భద్రతా బలగాలను హై అలర్ట్‌లో ఉంచింది. సైనిక సిబ్బందిని తరలించే కాన్వాయ్‌ల రాకపోకలను నిలిపివేసింది.జవాన్ల కాన్వాయ్‌లపై దాడి జరిగేందుకు అవకాశం ఉందన్న నిఘావర్గాల సమాచారం మేరకు వాటి రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించామని సంబంధిత అధికారులు తెలిపారు. అమర్‌నాథ్ యాత్ర వాహనాలకు కూడా ఇవే ఆంక్షలు ఉంటాయని తెలిపారు. జమ్ములో దాడి ముప్పు పొంచి ఉన్నందున బలగాలు ఒంటరిగా ఉండొద్దని హెచ్చరించారు.

అలాగే ఇప్పటికే అదనపు భద్రతా సిబ్బందిని ఆ ప్రాంతానికి తరలించారు. తొలిసారి అసోం రైఫిల్స్‌ను ఈ ప్రాంతంలో మోహరించారు. చొరబాట్లు, అనుమానాస్పద కదలికలను పర్యవేక్షించేందుకు సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే, ఈ ఉదయం నియంత్రణ రేఖ సమీపంలోని అఖ్నూర్‌, సుందర్‌బనీ సెక్టార్ల వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించారు. దీనితో ఆర్మీ వార్నింగ్‌ షాట్స్‌ను పేల్చింది. ఆ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపడుతోంది.

జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూ- కశ్మీర్ ను రెండు కేంద్రపాలిత (జమ్మూ-కశ్మీర్, లడఖ్) ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని జమ్మూ కశ్మీర్‌కు చెందిన పలు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్దమే అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆర్టికల్‌ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గానీ, శాశ్వతం కాదని తేల్చి చెప్పింది. జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.