ఒక నియంత బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్కి ఆరాధ్యుడయ్యాడు. భారత ద్వేషి, కార్గిల్ యుద్ధ కారకుడు, భారత్ అంటేనే ఒంటి కాలుతో లేచే పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ పేరును నివాళులు అర్పించే వ్యక్తుల జాబితాలోకి చేరిపోయింది. అది కూడా కార్గిల్ విజయ్ దివస్ రోజున. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) అనేది వామపక్ష ప్రేరేపిత ట్రేడ్ యూనియన్. ఇది జరిగింది కేరళలో. హిందువుల నుంచి, బీజేపీ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ట్రేడ్ యూనియన్ ఆ విషయాన్ని వెనక్కి తీసుకుంది. ఇది జరిగింది కేరళలో. అసలు ఏం జరిగిందంటే…
కేరళలోని అలప్పుళలో ఓ సదస్సు నిర్వహించాలని అలప్పుళ నగరంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఈ సదస్సులో పాక్ మాజీ అధ్యక్షుడు, నియంత పర్వేజ్ ముషార్రఫ్కి నివాళులు అర్పించాలని నిర్ణయించారు. కార్గిల్ విజయ్ దివస్ రోజునే యూనియన్ రాష్ట్ర సదస్సు జరపాలని తలపెట్టారు. ఈ సదస్సునుకాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రారంభించాల్సి వుంది. కానీ ఆయన హాజరవ్వలేదు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న హిందువులు, బీజేపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో అసలు ముషార్రఫ్ పేరు వున్నట్లు తమకు తెలియదని, ఇదో పొరపాటు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.
మరోవైపు ముషార్రఫ్కి నివాళులు అర్పించాలని తీసుకున్న నిర్ణయంపై నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ మరియు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ తీవ్రంగా ఖండించాయి. ఇదో దేశ వ్యతిరేక నిర్ణయమని మండిపడ్డారు. దేశం కోసం అనేక మంది జవాన్లు ప్రాణాలు అర్పించారని, దానిని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు. ఇలా చేస్తూ దేశ వ్యతిరేకులకు మద్దతిస్తున్నారంటూ తీవ్రంగా ఆక్షేపించారు. ఆర్థిక శాఖ వెంటనే జోక్యం చేసుకొని, సమగ్ర దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను కూడా బహిష్కరించాలని బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరారు.