News

గిరిప్రదక్షిణ పరిపూర్ణం.. అప్పన్న స్వామికి సంప్రదాయబద్ధంగా చందన సమర్పణ

49views

విశాఖ జిల్లాలోని సింహాచలం క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ మహోత్సవం ఆదివారం ఉదయం పరిపూర్ణమైంది. శనివారం ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు 32 కిలోమీటర్లు సింహాచలం కొండను పాదయాత్రగా చుట్టి వచ్చారు. వారంతా ఆదివారం ఉదయానికి అప్పన్న ఆలయానికి చేరుకున్నారు. సింహాద్రి నాథుడిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామికి తుది విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామికి విశేష పూజలు, ఆరాధనలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ముందుగా సిద్ధం చేసిన మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) శ్రీ గంధాన్ని సింహగిరి నరహరికి సమర్పించారు. గిరిప్రదక్షిణ చేయలేని భక్తులు సింహగిరిపై మూడుసార్లు ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు.