ArticlesNews

ప్రపంచానికి పరిచయం అయిన మన నరసాపురం లేసు అల్లికలు… ఒలంపిక్స్‌ ఆర్డర్స్ ఈసారి వీరికే

302views

మన రాష్ట్రంలోని నరసాపురం మహిళలకి ప్రపంచ వ్యాప్తంగా ఘనమైన గౌరవం దక్కింది. సహజంగా ఫ్యాషన్‌ అంటే గుర్తుకొచ్చేది పారిస్‌ దేశం. ఫ్యాషన్‌ అనే దానికి కేంద్ర బిందువు పారిస్సే. ఈసారి ఒలంపిక్స్‌ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. అయితే.. క్రీడాకారులు ఉపయోగించే లేసులు, లేసు వస్త్రాలు, దిండ్లు, ఇక్కడి నుంచే వెళ్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురంలో మహిళలతో తయారైన చేతి ఉత్పత్తులకి ఇప్పుడు ప్రపంచ గుర్తింపు దక్కింది.

ఈ నెల 26 నుంచి వచ్చే నెల 11 వరకు ప్యారిస్‌ వేదికగా ఒలంపిక్స్‌ గేమ్స్‌ జరగనున్నాయి. ఈ ఒలంపిక్‌ క్రీడల్లో క్రీడాకారుల కోసం టవళ్లు, న్యాప్కిన్లు, పిల్లో, టవల్స్‌, కుషన్లు, బీచ్‌ టవల్స్‌ వంటి వాటిని నరసాపురం మహిళలు అందించారు. ఒలంపిక్స్‌ క్రీడాకారులకు తాము తయారు చేసిన లేసు ఉత్పత్తులు అందించడం తమకు గర్వంగా వుందని నిర్వాహకులు ప్రకటించారు. త్వరలోనే మన తెలుగు మహిళలు తయారు చేసిన లేసు ఉత్పత్తులు ఒలంపిక్స్‌ క్రీడాకారులతో పాటు సందర్శకుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. అయితే.. ఈ ఆర్డర్‌ కోసం తామెంతో కష్టపడ్డామని నిర్వాహకులు తెలిపారు. కోవిడ్‌ తర్వాత లేసు పరిశ్రమ బాగా దెబ్బతిన్నదని, ఈ ఆర్డర్‌తో కాస్త మెరుగైన పరిస్థితి నెలకొంది.

బ్రిటీషర్స్‌ కాలం నుంచే నరసాపురం మహిళలు ఈ లేసు పరిశ్రమలో వుండేవారు. ఆంగ్లేయులు కూడా మన మహిళలపై ఆధారపడేవారు. మహిళలు అల్లికలు, లేసు పరిశ్రమనే ఆధారంగా జీవనోపాధి చేసుకునేవారు. రానూ రానూ ఈ పరిశ్రమ అద్భుతంగా విస్తరించింది. పేద, ధనిక మహిళలందరు కూడా అల్లికలు చేస్తుంటారు. కోనసీమ, రాజమండ్రి, భీమవరం ప్రాంతాల్లో చాలా మంది మహిళలు జీవనోపాధి పొందుతుంటారు. మరోవైపు 2005 లో సీతారాంపురం వద్ద అప్పటి సర్కార్‌ లేస్‌పార్క్‌ను ప్రారంభించారు. టవల్స్‌, టేబుల్‌ క్లాత్స్‌, లంచ్‌ మ్యాట్స్‌, క్రోషే బ్యాగ్స్‌, బీచ్‌ కలెక్షన్స్‌ తదితర మన హ్యాండ్‌ మేడ్‌ లేసు ఉత్పత్తులకు మంచి ఆదరణ వుంది.