News

ఆకాశ‌గంగా శ్రీ బాలాంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో శాస్త్రోక్తంగా సుమ‌ల్లికార్చ‌న‌

65views

శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ స్థ‌ల‌మైన ఆకాశ‌గంగ‌లో వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం నుండి శ్రీ అంజ‌నాదేవి స‌మేత శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారు వెల‌సి ఉన్నార‌ని, హ‌నుమ‌త్‌ జ‌యంతి సంద‌ర్భంగా విశేష అభిషేక పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లో హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు శ‌నివారం వైభ‌వంగా ప్రారంభమ‌య్యాయి.

ముందుగా ఆకాశ‌గంగ‌లో శ్రీ అంజ‌నాదేవి, శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారికి శ్రీ‌వారి ఆల‌యం నుండి విశేష‌మైన శేష‌ వ‌స్త్రాలు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స‌మ‌ర్పించారు. హ‌నుమంతుని జ‌న్మ విశేషాల‌తో ప్రారంభ‌మై, ఉప‌చారాలు, పంచామృత స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. లోక క్షేమం కొర‌కు స్వామివారికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన మ‌ల్లెల‌తో స‌హ‌స్ర‌నామ అర్చ‌న నిర్వ‌హించారు.

జ‌పాలి తీర్థంలోని శ్రీ ఆంజ‌నేయ‌స్వామి….
జ‌పాలి తీర్థంలోని శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారికి ఈవో ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించి, ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.అనంత‌రం జ‌పాలి తీర్థం వ‌ద్ద ఈవో మీడియాతో మాట్లాడుతూ, హ‌నుమంతుల వారు అంజ‌నాదేవి త‌పోఫ‌లితంగా వాయుదేవుని వ‌ర‌ప్ర‌సాదంతో అంజ‌నాద్రిలో జ‌న్మించార‌ని పురాణాల ద్వారా తెలుస్తోంద‌న్నారు. హ‌నుమజ్జ‌యంతి సంద‌ర్భంగా హ‌నుమ జ‌న్మ‌స్థాన‌మైన ఆకాశ‌గంగ తీర్థంలోని శ్రీ బాలంజ‌నేయస్వామివారికి ఐదు రోజుల పాటు అభిషేకం నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. అదేవిధంగా నాద‌నీరాజ‌నం వేదిక‌, ఆకాశ‌గంగ‌, జ‌పాలి ప్రాంతాల్లో ధార్మికోప‌న్యాసాలు, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని వివ‌రించారు.