డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ స్టెబిలైజేషన్ మిషన్లో పని చేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్ను ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2023)తో సత్కరించనుంది. మే 30న ఐరాస అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమెకు ఈ అవార్డు అందించనున్నారు. 2019లో మొదటిసారిగా ఈ అవార్డును మేజర్ సుమన్ గవానీ అందుకోగా, రెండోసారి మేజర్ రాధికాసేన్ అందుకోనున్నారు.
విధి నిర్వహణలో బలిదానం చేసిన శాంతి రక్షకులకు ‘అంతర్జాతీయ ఐరాస శాంతి రక్షకుల దినోత్సవం’ సందర్భంగా ఈ నెల 30న డ్యాగ్ హామర్ షోల్డ్ పతకాలను ప్రదానం చేయనున్నట్లు సమితి ప్రకటించింది. ఈ పతకాలను పొందే 64 మంది సైనిక, పోలీసు, పౌర శాంతిరక్షకులలో భారతీయ జవాన్, దివంగత నాయక్ ధనంజయ్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు. ఆయన సమితి శాంతిరక్షక సేన సభ్యుడిగా కాంగోలో విధులు నిర్వహిస్తూ ప్రాణత్యాగం చేశారు.