
దేశ రక్షణ అవసరాల కోసం విశాఖపట్నం హిందుస్థాన్ షిప్యార్డులో నిర్మించిన భారత నౌకాదళానికి చెందిన ‘డైవింగ్ సపోర్టు వెసల్(డీఎస్వీ)- నిస్తార్’ను సీ ట్రయల్ (సముద్రంలో పరీక్షించడం) పంపినట్టు మంగళవారం సంస్థ యాజమాన్యం తెలిపింది. 27న ఉదయం వెసల్ సీ ట్రయల్ను షిప్యార్డు అధికారి జెండా ఊపి ప్రారంభించారు. ప్రక్రియ తర్వాత అదే రోజు సాయంత్రం సురక్షితంగా యార్డు జెట్టీకి చేరుకుందని, ఎలాంటి ప్రధాన సమస్యలు తలెత్తలేదని యాజమాన్యం పేర్కొంది. రక్షణ రంగానికి అవసరమైన యుద్ధనౌకల నిర్మాణాన్ని 1993లోనే షిప్యార్డు చేపట్టిందని, తర్వాత ఇండియన్ నేవీ కోసం రెండు డీఎస్వీల(నిస్తార్, నిపుణ్) నిర్మాణం చేపట్టి 2022 సెప్టెంబరు 22న వాటిని ఒకేసారి జలప్రవేశం చేయించినట్టు గుర్తు చేసింది.




