ఆనాటి రాజకీయ కాలమాన పరిస్థితుల కారణంగా ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్య పరిచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ విసి ఆచార్య భూమన కుసుమకుమారి పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు నాలుగవ రోజుకు చేరుకున్నాయి.
సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య భూమన కుసుమ కుమారి ”అన్నమయ్య – తాత్త్వికత ” అనే అంశంపై ఉపన్యస్తూ, వైరాగ్యం, విరక్తి, కోర్కేలు లేక పోవడం వంటి వాటిని ప్రభోదిస్తూ, ప్రజలను ఆధ్యాత్మికత, మోక్ష మార్గంలో నడేపేందుకు అన్నమయ్య సంకీర్తనను రచించిట్లు తెలిపారు. శ్రీవారిని సంకీర్తన ద్వారా సామాన్యులకు చేరువ చేసేందుకు అన్నమయ్య కృషి చేసినట్లు వివరించారు.శ్రీనివాసుడు ఎంతటి మహిమ గల దేవుడో అన్నమయ్య అంతటి విశిష్టమైన భక్తుడన్నారు.
తిరపతి శ్రీ పద్మావతి మహిళ డిగ్రీ, పిజి కళాశాల అధ్యాపకులు డా.క్రిష్ణవేణి ”అన్నమయ్య కీర్తనలు – సందేశం” అనే అంశంపై మాట్లాడుతూ, అన్నమయ్య సమాజం కోసం ప్రతి కీర్తనలో సందేశం అందించారన్నారు.అన్నమయ్య వాగ్గేయకారులకు, కవులకు భాషా సందేశం, కీర్తనలు, కీర్తన అంశాల విధాన సందేశం, తాత్విక, సంగీత సందేశం ఇచ్చినట్లు వివరించారు.
తణుకుకు చెందిన ప్రముఖ సాహితీవేత్త శ్రీ రసరాజు ”శ్రీవారి సేవలో – అన్నమయ్య ” అనే అంశంపై ఉపన్యస్తూ, పద్యం పల్లకీలో ఊరేగుతున్న దశలో పాటలు బాగా రాయడానికి ప్రేరకుడు అన్నమయ్య అన్నారు. చక్రవర్తులు, రాజుల ఆస్థానాలలో పరిమళిస్తున్న పద్యానికి, సంకీర్తనల పరిమళాన్ని అందించిన మహనీయుడు అన్నమయ్య అని తెలిపారు.