
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం స్వామివారు కాళీయమర్ధన ఆలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి ఆలయ యాగశాలలో అర్చకులు పుట్టమన్ను తెచ్చి పొలికల్లో పోసి అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తర్వాత గరుడ పటాన్ని ధ్వజస్తంభానికి ఎగురవేసి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు.
కాగా ద్వారకా తిరుమల శ్రీవారి వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 25వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. బ్రహోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఆలయ నిత్యకల్యాణ మండప ఆవరణలో విశేష అలంకరణలో అలివేలు మంగ, ఆండాళ్ అమ్మవార్లు కొలువుతీరగా.. నడుమ ఉన్న చిన్నతిరుమలేశుడు పెండ్లి కుమారునిగా ముస్తాబయ్యారు. ఉభయదేవేరులు పెండ్లి కుమార్తెలయ్యారు. ఉదయం ఏర్పాటు చేసిన సువర్ణ సింహాసనంపై స్వామి, అమ్మవార్ల కల్యాణమూ ర్తులను ఉంచి ఆలయ అర్చకులు హారతులిచ్చి ఈ తంతును నిర్వహించారు. ఈవో త్రినాథరావు ఆద్యంతం పాల్గొని అర్చకులు, పండితులకు దీక్షా వస్త్రాలను అందచేసి అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.





