News

ఏ చేపలా ఉండాలి?

268views

మనందరికీ తెలిసిన 3 చేపల కథలో- చెరువు ఎండిపోతోందని గ్రహించిన మొదటి చేప- ఆపద వచ్చేట్లుంది.. మరో చోటుకు వెళ్దామంది. రెండోది- ప్రమాదం వచ్చినప్పడు తప్పించుకోవచ్చులెమ్మంది. మూడో చేప- ఆమాత్రానికే దిగులెందుకు అంది. మొదటిది మరో చెరువులోకి వెళ్లగా, రెండోది ఆపద వచ్చాక తప్పించుకుంది. తాపీగా ఉన్న మూడో చేప పట్టుబడింది. మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు చెప్పిన ఈ కథలో అనాగత విధాత, ప్రత్యున్నమతి, దీర్ఘసూత్రి- అంటూ ఆ చేపలకు పేర్లు పెట్టి.. వాటి తత్వాలను నిర్వచించాడు. మనలోనూ మూడు రకాల వాళ్లుంటారు. మొదటి రకంలా మానసిక అలజడులూ, ఆందోళనలను ముందే పసిగట్టి అప్రమత్తమై ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తారు. రెండో రకంవారు ఆపద కలిగి నప్పుడు సమయస్ఫూర్తితో అధిగమించి దైవాన్ని ఆశ్రయిస్తారు. మూడో రకంవారు నిర్లక్ష్యంతో కాలయాపన చేస్తూ మరణం సమీపించే వరకూ పరమాత్ముడి గురించిన ఊసే లేకుండా గడిపేస్తారు. ఈ చేపల్లో ఏ చేపలా ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి.