
శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఇచ్చే స్పాట్ బుకింగ్లను రద్దు చేస్తున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం ప్రకటించింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు వెల్లడించింది. శబరిమలకు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారిక వెబ్సైట్లో వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్నవారినే దర్శనానికి అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. మే 4న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రోజుకు వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా అయ్యప్ప దర్శనానికి 80,000 మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో ఆన్లైన్ బుకింగ్ సదుపాయం 10 రోజుల ముందు వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దానిని మూడు నెలల ముందు వరకు ట్రావెన్కోర్ దేవస్థానం పెంచింది. మరోవైపు, తిరువాభరణం ఊరేగింపు, మకరవిళక్కు సమయంలో ఆన్లైన్ బుకింగ్ను అనుమతించాలా? వద్దా? అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.





