News

ఛత్తీస్‌గఢ్ లో ఎన్‌కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి

351views

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. గత 15 రోజుల వ్యవధిలో ఎదురుకాల్పులు జరగడం ఇది రెండోసారి.

అధికారులు తెలిపిన వివరాలు…
అబూజ్‌మడ్‌లోని టేక్‌మేటా-కాకుర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నారాయణ్‌పూర్‌ ఎస్పీ ప్రభాత్‌ కుమార్‌ నేతృత్వంలో జిల్లా రిజర్వు గార్డు(DRG), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌(STF) దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో పెద్దసంఖ్యలో మావోయిస్టులు, జవాన్లకు తారసపడ్డారు. తప్పిచుకునేందుకు భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు.

అప్రమత్తమైన పోలీసు సిబ్బంది కూడా ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఇరువర్గాల మధ్య గంటకు పైగానే బుల్లెట్ ఫైట్ జరిగింది. ఘటనా స్థలిలో భారీ ఎత్తున ఆయుధాలు లభించాయి. గడిచిన నాలుగు నెలల వ్యవధిలో బస్తర్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 91 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. తాజా ఘటనపై స్పందించిన ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ శర్మ, నక్సలైట్లు హింసను వీడి ప్రభుత్వంతో చర్చలకు రావాలని సూచించారు.