
అయోధ్య రామ్ లల్లా భక్తులకు ఆలయ ట్రస్ట్ కీలక అప్డేట్ చేసింది. శ్రీరామనవమి కారణంగా కొంతకాలంగా నిలిపివేసిన వీవీఐపీ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. శనివారం నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రామనవమి ఉత్సవాలకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున, రామ మందిరం ట్రస్ట్ ఏప్రిల్ 18 వరకు వీఐపీ దర్శనం, పాస్ల ద్వారా దర్శనాన్ని నిషేధించింది. ఈ కారణంగా ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 18 వరకు స్లాట్లు బుక్ చేసుకున్న వారి పాస్లు సైతం రద్దయ్యాయి. ఈ తరుణంలో రామనవమి ఉత్సవాలు ముగిసినందున వీవీఐపీ దర్శనాన్ని మళ్లీ కల్పిస్తున్నట్లు ట్రస్టు స్పష్టం చేసింది.
విశిష్ట దర్శన్, సుగం దర్శన్ అనే రెండు కొత్త మార్గాలను ఏర్పాటు చేసింది. ఈ కేటగిరీలో ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల మధ్య రెండు గంటల చొప్పున ఆరు వేర్వేరు స్లాట్లలో దర్శన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రత్యేక దర్శనం కోసం ప్రతి స్లాట్లో 100 పాస్లు జారీ అవుతాయి. వీటిలో 20 పాస్లు ఆన్లైన్లో అందుబాటులో ఉండగా మిగతా 80 పాస్లు ట్రస్ట్ ద్వారా అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. బాల రాముడి మంగళ, భోగ్, శయన్ ఆరతిలో పాల్గొనడానికి ప్రతి ఆరతికి హాజరయ్యేందుకు 100 పాస్లు జారీ చేస్తారు. ఇవి ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో అందుబాటులో ఉంటాయి.





