
గరుడ ప్రసాదం కోసం చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్రసాదాన్ని స్వీకరించడంతో సంతానం కలుగుతారని విశ్వాసం. దాదాపు 5 వేల మంది భక్తులు ప్రసాదం కోసం వస్తారని ఆలయ అధికారులు అంచనా వేశారు. కానీ అంచనాకు మించి దాదాపు 60 వేల మంది ఆలయానికి పోటెత్తారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సుమారు 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
మాసబ్ట్యాంక్ నుంచి మెహదీపట్నం, నానల్ నగర్, లంగర్హౌస్, సన్సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు ఆలయం వరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. శుక్రవారం వేకువజామున 5 గంటల నుంచే హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు చిలుకూరుకు తరలివచ్చారు.





