
భారత్తో బలమైన బంధం ప్రాముఖ్యతను అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ మరోసారి నొక్కిచెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతకు భారత్ చాలా అవసరమని ఉద్ఘాటించారు. అందుకనుగుణంగా ఇండియా సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు సహకారం అందించాలని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీకి వివరించారు. ఈ మేరకు కావాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలను వారి ముందుంచారు.
ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారం గురించి కమిటీకి ఆస్టిన్ తెలిపారు. హిందూ మహా సముద్రంలో భద్రత కోసం సంయుక్త సైనిక విన్యాసాలు, కీలక సమాచార మార్పిడి సహా ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. దీంతో ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా కలిసి చేస్తున్న ప్రయత్నాలకు దన్ను లభిస్తోందన్నారు.
స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ నిర్మాణానికి భారత్-అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా కీలకమని కమాండర్ అడ్మిరల్ జాన్ సి అక్విలినో సెనెట్ చట్టసభ్యులకు వివరించారు. ఈ మేరకు ఎయిర్ డొమైన్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. రెండోళ్లకోసారి జరిగే ఏరో ఇండియాలో అమెరికా బీ-1బీ బాంబర్ విమానాలు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ద్వైపాక్షిక వైమానిక విన్యాసాలు ‘కోప్ ఇండియా’లోనూ అగ్రరాజ్యం భాగస్వామ్యమవుతోందని అక్విలినో వివరించారు. టైగర్ ట్రయంఫ్ పేరిట భారీ విన్యాసాలనూ చేపట్టినట్లు గుర్తుచేశారు.
భారత షిప్యార్డుల్లో అమెరికా నౌకల మరమ్మతులు సహా హిందూ మహాసముద్రంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నట్లు అక్విలినో చెప్పారు. ‘లాజిస్టిక్స్ ఎక్స్ఛేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్’ కింద వీటిని చేపట్టనున్నట్లు తెలిపారు.





