
అరుణాచల్ ప్రదేశ్ మన భారత భూభాగమే అయినప్పటికీ.. చైనా మాత్రం అది తమదేనంటూ మొండిగా వ్యవహరిస్తూ వస్తోంది. దానిని సౌత్ టిబెట్ (జాంగ్నాన్)గా అభివర్ణిస్తూ.. ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని వాదిస్తోంది. ఇటీవల చైనా రక్షణ మంత్రిత్వ శాఖ కూడా అదే వాదనని పునరుద్ఘాటించింది. జాంగ్నాన్ తమదేనంటూ.. ఆ దేశ రక్షణ శాఖ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ షియాగాంగ్ వ్యాఖ్యానించారు. ఇందుకు భారత్ తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చైనా ప్రకటన అసంబద్ధమైనదని, అరుణాచల్ ఎప్పటికీ భారత్లో భాగమేనని స్పష్టం చేసింది.
‘‘భారత రాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ భూభాగంపై చైనా రక్షణ శాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనవి. ఈ వ్యవహారంలో నిరాధార వాదనలను పునరావృతం చేసినంత మాత్రాన.. అవి వాస్తవాలుగా మారిపోవు. అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగం. అరుణాచల్ మన దేశంలో విడదీయరాని భాగం. భవిష్యత్తులో కూడా అది అలాగే ఉంటుంది. భారత అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా ఆ ప్రాంత పౌరులు ప్రయోజనం పొందుతూనే ఉంటారు. అక్కడి ప్రజలకు మేలు చేసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అంటూ భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.





