News

హిందూ మున్నని ఆందోళనతో ఆలయ భూమి నుంచి చర్చి తొలగింపు

315views

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఓ క్రైస్తవ కుటుంబం ఆలయ భూమిని ఆక్రమించేసింది. అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. పనిలో పనిగా ఓ చర్చ్ కూడా కట్టేసారు. దాంతో హిందూ మున్నని సంస్థ రంగంలోకి దిగింది. వారు చేసిన ఆందోళనలకు అధికారులు దిగివచ్చారు. అక్రమ నిర్మాణాలను తొలగించారు.

తిరునల్వేలిలో కరుప్పూన్‌దురై అళియపతీశ్వర ఆలయం ఉంది. ఆ ఆలయానికి ముందు ఒక తోట ఉండేది. ఆ తోటలో పూలను దండలు కట్టి ఆలయంలో దేవతామూర్తులకు అలంకరించేవారు. ఆ తోట ఉన్న భూమి ఆలయానిదే.

కొన్నాళ్ళ క్రితం ధర్మరాజు అనే పేరు గల క్రైస్తవుడు ఒకాయన గుడి ముందున్న తోట స్థలాన్ని అక్రమంగా ఆక్రమించాడు. అక్కడ ఒక భవనం, చర్చి నిర్మించేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన హిందూ మున్నని సభ్యులు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసారు. కానీ డిఎంకె ప్రభుత్వం ఆ అక్రమ చర్చ్ విషయంలో ఏ చర్యా తీసుకోలేదు.

ఆ నేపథ్యంలో హిందూ మున్నని సభ్యులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేసారు. దాంతో అధికారులకు మరో అవకాశమే లేకుండా పోయింది. మార్చి 12 ఉదయం 10 గంటలకు అధికారులు, ఆక్రమిత ఆలయభూమిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసారు.

హిందూ మున్నని కార్యకర్త, న్యాయవాది కె కుత్రాళనాథన్ ‘‘ఈ విషయంలో చర్యలు తీసుకున్నందుకు దేవదాయ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులకు హిందూ మున్నని తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. పోలీసులు గతంలో హిందూ మున్నని కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు. కొంతమందిని హింసించారు. వారింకా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. ఈ భూమి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు ఉంటుంది’’ అని చెప్పారు.

ఈ మొత్తం వ్యవహారంపై హిందూ మున్నని అధ్యక్షుడు కడేశ్వర సుబ్రమణియం ఒక ప్రకటన విడుదల చేసారు. ‘‘తిరునల్వేలి కరుప్పూన్‌దురై అళియపతీశ్వర ఆలయానికి పూలతోట కోసం 70 సెంట్ల భూమి ఉంది. దాని ప్రస్తుత విలువ సుమారు రూ.2కోట్లు ఉంటుంది. గ్రామపంచాయతీ మాజీ అధ్యక్షుడు, క్రైస్తవుడూ అయిన ధర్మరాజు ఆ భూమిని ఆక్రమించాడు. అక్కడ ఒ క చర్చి, ఇటుకల గోడ, కోళ్ళఫారం నిర్మించాడు. ఈ విషయమై మేము దేవదాయ శాఖను ఆశ్రయించాం. అయితే ఆ భూమికి సంబంధించి వారివద్ద ఏ పత్రాలూ లేవని చెప్పారు. ఆ సాకుతో ఎలాంటి చర్యా తీసుకోడానికైనా నిరాకరించారు. మేము ఎలాగోలా పత్రాలు సంపాదించి పట్టుకొచ్చి వారికి అప్పగించాం. అయినా వారు కేసుని నానుస్తూనే వచ్చారు. ఇక గత నెలలో మేము ఒంటికాలి మీద నిలబడి ఆందోళన చేసాము. ఆ దెబ్బకు రెవెన్యూ అధికారులు వచ్చారు, వివాదంలో ఉన్న భూమిని సర్వే చేసి సరిహద్దురాళ్ళు ఏర్పాటుచేసారు. కానీ వారు కూడా అక్రమ నిర్మాణాలను ముట్టుకోలేదు. ఆలయ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించడం కోసం జోక్యం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్‌కూ, దేవదాయ శాఖ మంత్రికీ పిటిషన్లు పెట్టుకున్నాం.’’

‘‘ఈ చర్యలతో ధర్మరాజుకు తీవ్ర ఆగ్రహం కలిగింది. హిందూమున్నని జిల్లా కార్యదర్శి శంకర్ నడుపుతున్న ఆలయం దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో శంకర్ లేకపోవడంతో అతని భార్యపై దాడి చేసాడు. ఆమెను రక్షించుకునే ప్రయత్నంలో ఆమె కొడుకు వారిని కొట్టాడు. వాళ్ళిచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసారు. దర్యాప్తు జరుగుతోంది. ధర్మరాజు, అతని అనుచరుల మీద కేసు రిజిస్టర్ అయింది. దానికి ప్రతీకారంగా ధర్మరాజు శంకర్ కుటుంబం మీద కేసు పెట్టాడు. శంకర్ తనను కులం పేరుతో దూషించాడంటూ మండిపడ్డాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శంకర్‌ని కూడా అరెస్ట్ చేసారు. కాలేజీ విద్యార్ధి అయిన శంకర్ ఇప్పుడు జైల్లో బందీగా ఉన్నాడు’’

పోలీసులు యాంత్రికంగా తమ పని చేస్తున్నారే తప్ప ధర్మరాజును అరెస్ట్ చేయలేదని సుబ్రమణియం ఆరోపించారు. ధర్మరాజు శంకర్ దుకాణం దగ్గర అతని భార్య, కొడుకుల మీద భౌతికంగా దాడికి పాల్పడ్డాడు. అయినా శంకర్ నుంచి ఫిర్యాదు తీసుకోలేదు. ధర్మరాజు ఫిర్యాదుపైన మాత్రం హుటాహుటిన చర్యలు తీసుకోడాన్ని ఖండిస్తున్నాం. కాలేజీ విద్యార్ధి అయిన శంకర్ కొడుకును తప్పుడు ఫిర్యాదుతో జైల్లో పెట్టారు. అంతేకాదు, పాస్టర్ ధర్మరాజు కుట్ర చేసి, న్యాయవాది కుట్రాళనాథన్, మరో 12మందిపైనా తప్పుడు కేసులు బనాయించారు. పోలీసుల దుశ్చర్యను హిందూ మున్నని ముక్తకంఠంతో ఖండిస్తోంది. ఒక ప్రయోజనం కోసం కలసి పనిచేస్తున్న వ్యక్తుల ఆత్మస్థైర్యానికి అలాంటి ఆచరణలు అడ్డంకులుగా మారతాయి. ఈ కేసులో వ్యక్తిగతంగా చొరవ తీసుకుని విచారణ జరిపించాలని తిరునల్వేలి పోలీస్ కమిషనర్‌ను అభ్యర్ధిస్తున్నాం అని సుబ్రమణియం చెప్పుకొచ్చారు.