
చందమామపై పరిశోధనలు చేస్తున్న అమెరికా ల్యాండర్ ‘ఒడిసియస్’.. నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయింది. తాజాగా అక్కడ రాత్రివేళ కావడంతో బ్యాటరీల ఛార్జింగ్కు సౌరశక్తి అందుబాటులో ఉండదు. దీనికితోడు తీవ్ర శీతల వాతావరణం నెలకొంటుంది. దీంతో ఇంజినీర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యోమనౌక.. దాదాపు వారం కిందట చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో దిగిన సంగతి తెలిసిందే. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని నిలబడితే రెండు నుంచి మూడు వారాల తర్వాత ఈ వ్యోమనౌక మళ్లీ క్రియాశీలమవుతుంది. ల్యాండింగ్ సమయంలో ఒడిసియస్ కాలు విరగడంతో అది ఒకపక్కకు ఒరిగిపోయింది. దీంతో సౌరశక్తి లభ్యత, కమ్యూనికేషన్లో ఇబ్బందులు తలెత్తాయి. అయినా ఈ వ్యోమనౌక తమ అంచనాలకు మించి పనిచేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్యూటివ్ మెషీన్స్ అనే సంస్థ దీన్ని రూపొందించింది. చందమామపై దిగిన తొలి ప్రైవేటు వ్యోమనౌక ఇదే.





