
జమ్మూకశ్మీర్కు చెందిన జమాత్-ఎ-ఇస్లామీ సంస్థపై నిషేధాన్ని కేంద్ర హోంశాఖ మరో ఐదేళ్ళపాటు పొడిగించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా చట్టం) నిబంధనల ప్రకారం జమాతే ఇస్లామీ సంస్థపై నిషేధాన్ని పొడిగిస్తూ మంగళవారం నాడు హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది.
జమాతే ఇస్లామీ సంస్థ దేశ భద్రత, సమైక్యత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉందని గుర్తించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఆ కారణం వల్లనే ఆ సంస్థపై నిషేధాన్ని పొడిగించినట్లు ప్రకటించింది. జమాతే సంస్థపై మొదటిసారి 2019 ఫిబ్రవరి 28న నిషేధం విధించారు.
జమాత్-ఎ-ఇస్లామీ సంస్థపై నిషేధాన్ని పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి ఆ విషయాన్ని తన ‘ఎక్స్’ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఉగ్రవాదంపైనా, వేర్పాటువాదంపైనా అనుసరిస్తున్న జీరో టోలరెన్స్ పాలసీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. దేశభద్రతకు ముప్పు కలిగించే సంస్థలు కఠిన చర్యలను ఎదుర్కొంటాయని అమిత్ షా వ్యాఖ్యానించారు.
‘‘జమాతే ఇస్లామీ సంస్థ జాతి వ్యతిరేక, విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొంటోంది. దేశంపై వ్యతిరేకతను పెంచేలా విద్వేషాలను రేకెత్తిస్తోంది. జమాతే చట్టవిరుద్ధ కార్యకలాపాలను తక్షణం నిలిపివేయకపోతే దాని విద్రోహ చర్యలురోజురోజుకూ పెరిగిపోతాయి. భారత భూభాగం నుంచి ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జోరందుకుంటాయి. జమ్మూకశ్మీర్ను భారత్ నుంచి విడదీసేందుకు, దేశవ్యతిరేక, వేర్పాటువాద భావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతాయి. అవి దేశ భద్రత, సమైక్యతకు భంగం కలిగిస్తాయి. అలాంటి ఉద్యమాలు మిలిటెన్సీని పురిగొల్పుతాయి, దేశంలో హింసాకాండను ప్రజ్వరిల్లజేస్తాయి’’ అని హోంశాఖ తన నోటిఫికేషన్లో ఆందోళన వ్యక్తం చేసింది.





