
సమ్మక్క, సారలమ్మ జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. వన దేవరుడు, సమ్మక్క భర్త పగిడద్దరాజుతో పాటు ఆయన కుమారుడు జంపన్నను నేడు మేడారం తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గిరిజన సంప్రదాయాల మేరకు పూజలు జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని ఆలయం నుంచి పగిడిద్దరాజును, ములుగు జిల్లా కన్నెపల్లి నుంచి జంపన్నను మేడారం తీసుకెళతారు.
పెన్క వంశీయుల వారసులు పగిడద్దరాజును పెళ్లికొడుకుగా అలంకరించారు. పూనుగొండ్ల అటవీమార్గం నుంచి పాదయాత్రగా మేడారం తీసుకెళ్ళడం ఆనవాయితీ. కర్లపల్లి లక్ష్మీపురంలో రాత్రికి విడిది చేసి, బుధవారం ఉదయానికి మేడారానికి పగిడిద్దరాజును చేరుస్తారు. సమ్మక్క తనయుడు, సారలమ్మ సోదరుడు జంపన్నను పోలెబోయిన వంశస్థులు, నేటి సాయంత్రానికి మేడారం తీసుకొచ్చి రాత్రికి ప్రతిష్టస్తారు.
సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, ‘మై మేడారం’ యాప్ ను తీసుకొచ్చింది. జాతరకు సంబంధించిన విశేషాలతో పాటు సౌకర్యాల గురించి భక్తులు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.





