
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. శ్రీవారి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అంకురార్పణను పురస్కరించుకుని ఆలయ మాఢవీదుల్లో శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్ సేనులవారు ఊరేగారు.
నవరాత్రి బ్రహ్మోత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభం కాగా అక్టోబర్ 23న చక్రస్నానంతో ముగుస్తాయి. మొదటి రోజు ఉదయం బంగారు తిరుచ్చిపై దర్శనం ఇచ్చిన శ్రీనివాసుడు, రాత్రి పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు.
అక్టోబర్ 16 ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంస వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అక్టోబర్ 17 ఉదయం సింహవాహనం, రాత్రి మత్యపు పందిరి వాహన సేవ జరుగుతుంది.18వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం జరుగబోతున్నాయి. 19వ తేదీన మోహిని అవతారం, రాత్రి స్వామి వారికి గరుడ ఉత్సవం జరుగనుంది. ఈసారి గరుడోత్సవం సాయంత్రం 6.30 గంటలకే ప్రారంభం కాబోతుంది.
20వ తేదీన ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పుష్పక విమానం, రాత్రి గజ వాహనంలో స్వామి వారు దర్శనమిస్తారు. 21న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలు జరుగబోతున్నాయి. 22న ఉదయం స్వర్ణ రథం, రాత్రి అశ్వ వాహన సేవలు జరుగుతాయి. అక్టోబర్ 23న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.





