News

సూరత్‌లో తొలిసారి వజ్రాల సదస్సు…. పాల్గొననున్న 13 దేశాల ప్రతినిధులు

175views

ప్రయోగశాలల్లో తయారు చేసిన వజ్రాల (ఎల్‌జీడీ) విక్రేతలు, కొనుగోలుదారులకు సంబంధించి గుజరాత్‌లోని సూరత్‌లో తొలిసారిగా సదస్సును ప్రారంభించినట్లు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) తెలిపింది. ఇందులో 13 దేశాల నుంచి 22 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నట్లు పేర్కొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కొనుగోలుదారులు, విక్రేతలు ప్రత్యక్షంగా డీల్స్‌ గురించి చర్చించుకోవచ్చని, దీర్ఘకాలిక వ్యాపార సంబంధాలను కుదుర్చుకోవచ్చని వివరించింది. గత అయిదేళ్లుగా భారత్‌లో ఎల్‌జీడీ విభాగం గణనీయంగా పెరిగిందని జీజేఈపీసీ చైర్మన్‌ విపుల్‌ షా వివరించారు. 2016–17లో 131 మిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎగుమతులు 2022 ఏప్రిల్‌–2023 ఫిబ్రవరి మధ్య కాలంలో 1.5 బిలియన్‌ డాలర్లకు చేరాయని తెలిపారు.