News

భక్తుల కోసం ఏప్రిల్ 25 నుంచి తెరవనున్న కేదార్‌నాథ్ ధామ్

190views

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ధామ్ ఏప్రిల్ 25వతేదీన భక్తుల సందర్శన కోసం తెరవనున్నారు. భక్తులు నడకతో పాటు హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకోవచ్చని ఉత్తరాఖండ్ అధికారులు తెలిపారు.భక్తుల కోసం కేదార్‌నాథ్ ధామ్ పోర్టల్‌ను తెరుస్తామని అధికారులు పేర్కొన్నారు. కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించే యాత్రికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆన్‌లైన్ బుకింగ్ అధికారం పొందింది.

రాబోయే చార్‌ధామ్ యాత్ర కోసం మొత్తం 6.34 లక్షల మంది భక్తులు వారి పేర్లను నమోదు చేసుకున్నారని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ మార్చిలో తెలిపింది.వీరిలో కేదార్‌నాథ్ ధామ్‌కు 2.41 లక్షలమంది, బద్రీనాథ్ ధామ్‌కు 2.01 లక్షలు, యమనోత్రికి 95,107 మంది, గంగోత్రి ధామ్‌కు 96,449 మంది భక్తులు పేర్లను నమోదు చేసుకున్నారని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ వెల్లడించింది.

చార్‌ధామ్ యాత్రలో ఆరోగ్య పరీక్షల కోసం హెల్త్ ఏటీఎం ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి పుష్కర్ ధామి చెప్పారు.ఏప్రిల్ 22వతేదీన యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తెరవడంతో చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఏప్రిల్ 25వతేదీన కేదార్‌నాథ్, ఏప్రిల్ 27వతేదీన బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి.