
ఖలిస్తాన్ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ గత 13 రోజులుగా పంజాబ్ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. సిక్కు యువత వేర్పాటువాదం వైపునకు మళ్లేలా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అమృతపాల్ సింగ్.
వేర్పాటువాదం, హింసను ప్రేరేపిస్తున్నందుకు మార్చి 18న అమృత పాల్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. చివరి క్షణంలో తప్పించుకుని పారిపోయాడు. రోజుకో వేషం మారుస్తూ పంజాబ్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. తాను తిరుగుబాటుదారుడని స్వయంగా ప్రకటించుకున్న అమృత్ పాల్.. పోలీసుల ఎదుట లొంగిపోయే ప్రసక్తే లేదంటూ తాజా వీడియోలో స్పష్టంచేశాడు. దేశ సమైక్యతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్న అమృత్ పాల్ను అరెస్టు చేసేందుకు పంజాబ్ పోలీసులు చేపడుతున్న ఆపరేషన్కు ఇతర రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర బలగాలు కూడా సహకారం అందిస్తున్నాయి.
అమృత్ పాల్కు ప్రజాదరణ ఉందంటూ..
ఈ నేపథ్యంలో అమృత్ పాల్ సింగ్ను అరెస్టు చేసేందుకు భారత భద్రతా బలగాలు చేపడుతున్న ఆపరేషన్కు వ్యతిరేకంగా టైమ్ పత్రిక ఓ అభ్యంతరకర కథనాన్ని ప్రచురించింది. 30 ఏళ్ల సిక్కు రాజకీయ నేత అమృత్ పాల్ సింగ్ను అరెస్టు చేసేందుకు భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నది ఆ కథనం సారాంశం. మానవ హక్కుల కంటే ఆ వ్యక్తిని అరెస్టు చేసేందుకే భారత్ ప్రాధాన్యత ఇస్తోందంటూ ఆ కథనంలో వండివార్చింది. భారత ప్రజాస్వామ్యాన్ని చిన్నబుచ్చేలా టైమ్ పత్రిక రాసిన ఈ కథనం పట్ల భారత్ ప్రభుత్వ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. భారత్, భారత ప్రజాస్వామ్యంపై విషం చిమ్మేలా టైమ్ పత్రిక కథనం ఉందంటూ అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. అదే సమయంలో ఈ కథనంలో అమృత్పాల్పై సానుభూతి కలిగేలా కొన్ని వ్యాఖ్యలున్నాయి. పంజాబ్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించేందుకు అమృత్పాల్ సింగ్ విశేషంగా కృషి చేశాడని, పంజాబ్లో ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడని టైమ్ స్టోరీలో ఉంది. అలాగే అమృత్పాల్ వేటలో పంజాబ్ పోలీసులు తీసుకుంటున్న చర్యలను 1984 జూన్లో జరిగిన సిక్కుల ఊచకోతను గుర్తుకు తెస్తున్నాయంటూ కథనాన్ని అల్లేసింది.
భారత్ను కించపరిచేలా..
ఇదే కథనంలో రెండేళ్ల క్రితం పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, అలాగే ఢిల్లీ వీధుల్లో రైతుల పోరాటం వంటి ఘటనలను గుర్తుచేసింది టైమ్ పత్రిక. తద్వారా భారత్లో మానవ హక్కులు ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందని భారత ప్రభుత్వాన్ని కించపరిచింది. ప్రస్తుతం భారత ప్రభుత్వం పంజాబ్ ప్రజలు ముఖ్యంగా సిక్కుల హక్కులను కాలరాస్తుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఇటీవల పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన మానవ హక్కుల కార్యకర్త, న్యాయవాది జస్సాల్ సింగ్ ఉదంతాన్ని ఉదాహరణగా చూపించింది. ఒక వ్యక్తి కోసం మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. మొత్తానికి అమృత్ పాల్ విషయంలో భారత ప్రభుత్వానిదే తప్పు, ఇక్కడ యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ కథనాన్ని అల్లేసింది టైమ్. ఈ కథనంపై భారత ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. మరి భారత ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా ఉండడంపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.




