
మన దేశంలో హెచ్3ఎన్2 వైరస్ ఇద్దరిని బలి తీసుకుంది. హర్యానా, కర్ణాటకల్లో ఒక్కొక్కరు చొప్పున దీనివల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ కారణంగా మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. మన దేశంలో ఇప్పటి వరకు ఈ వైరస్ సోకిన కేసులు 90 నమోదయ్యాయి. హెచ్1ఎన్1 వైరస్ కేసులు ఎనిమిది ఉన్నట్లు గుర్తించారు.
కర్ణాటక లోని హసన్లో హిరే గౌడను మధుమేహం, హైపర్టెన్షన్లతో బాధపడుతుండగా ఫిబ్రవరి 24న ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన వయసు 82 ఏళ్లు. ఆయన మార్చి 1న మరణించారు. మన దేశంలో హెచ్3ఎన్2 వైరస్ కారణంగా మరణించిన మొదటి వ్యక్తి ఆయనేనని అధికారులు ప్రకటించారు. హర్యానాలో ఈ వైరస్ కారణంగా మరణించిన వ్యక్తి వివరాలు తెలియవలసి ఉంది.
హెచ్3ఎన్2 వైరస్ అంటే…
ఈ వైరస్ సాధారణంగా పందుల్లో వ్యాపిస్తుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇది నాన్ హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అని తెలిపింది. ఈ వైరస్లు మానవులకు సోకితే, వేరియంట్ వైరస్లని పిలుస్తారని పేర్కొంది. హెచ్3ఎన్2 వేరియంట్ వైరస్ను 2011లో మొదటిసారి మానవుల్లో గుర్తించారని, 2009లో హెచ్1ఎన్1 పాండమిక్ వైరస్ ఎం జీన్ను గుర్తించారని తెలిపింది. ప్రస్తుతం హెచ్3ఎన్2కు సంబంధించిన అస్వస్థత సీజనల్ ఫ్లూ జ్వరాన్ని పోలి ఉన్నట్లు తెలిపింది.
లక్షణాలు ఇవే…
ఈ వైరస్ సోకినవారు జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు, దగ్గు, రొంప, ఒళ్లు నొప్పులు, తల తిరగడం, వాంతులు, అతిసార వంటివాటితో బాధపడతారు. ఈ లక్షణాలుగలవారు వెంటనే వైద్యుని సంప్రదించాలి. తరచూ చేతులను శుభ్రపరచుకోవడం, ఫ్లూ వ్యాక్సిన్లను వేయించుకోవడం వంటివాటివల్ల ఈ వైరస్ సోకకుండా నిరోధించవచ్చు.




