News

నక్సలిజం ఏ రూపంలో ఉన్నా ఓడించాలి: మోదీ

354views

హరియాణా: ఏ రూపంలో ఉన్నా నక్సలిజాన్ని ఓడించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో రాష్ట్రాల హోం మంత్రులు, డీజీపీలతో శుక్రవారం నిర్వహించిన చింతన్‌ శిబిరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

‘నక్సల్స్‌ గన్స్‌ పట్టుకోగలరు.. పెన్స్‌ పట్టుకోగలరు. వారు యువతను తప్పుదోవ పట్టిస్తారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. యువత భావోద్వేగాలను వాడుకొని దేశ సమైఖ్యతను దెబ్బతీయడానికి యత్నించేవారిని ఓడించేందుకు మన దళాలు మేధోశక్తిని పెంపొందంచుకోవాలన్నారు. నక్సలిజం ఘటనలను డీల్‌ చేయడానికి రాష్ట్రాలు నిపుణులను పంపాలని ప్రధాని సూచించారు. చట్టాలు, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ నక్సల్స్‌ అమాయకపు ముఖం పెడతారని చెప్పారు. భద్రతా దళాలు అటువంటి శక్తులను గుర్తించాలన్నారు.

బహుళ అంతస్తుల భవనాల్లో పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ సూచించారు. కింద అంతస్తులో పోలీస్‌ స్టేషన్‌ నిర్వహించి.. పై అంతస్తులో నివాస సముదాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. అప్పుడే పోలీసులు నగరాలకు దూరంగా నివసించడం తగ్గుతుందన్నారు. ప్రభుత్వ తుక్కు విధానం ప్రకారం పాత వాహనాలను వినియోగించడానికి దూరంగా ఉండాలని మోదీ పోలీసులను కోరారు.

దేశవ్యాప్తంగా పోలీసులకు ఒకేరకమైన యూనిఫాం ఉండాలన్నారు. రాష్ట్రాలు ఈ విషయంపై జాగ్రత్తగా ఆలోచించాలని అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా పోస్టుబాక్స్‌ను ఎలా గుర్తుపట్టగలమో.. పోలీస్‌ యూనిఫాంను కూడా అలానే గుర్తించగలిగేలా ఉండాలన్నారు. సోషల్‌ మీడియాను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయవద్దని ఆయన సూచించారు. అది తప్పుడు వార్తలతో గందరగోళం సృష్టించగలదన్నారు. రిజర్వేషన్ల అంశంలోనే ఇలాంటి పరిస్థితే చోటుచేసుకొని హింసకు దారి తీసిందని ప్రధాని గుర్తు చేశారు. ఏదైనా సమాచారాన్ని ఫార్వర్డ్‌ చేసే ముందు పదిసార్లు సరిచూసుకోవాలన్నారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి