
న్యూఢిల్లీ: త్రివిధ దళాలలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనకారులు, పలు విద్యార్థి సంఘాలు సోమవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హింసకు పాల్పడిన నిరసనకారులపై కఠినంగా వ్యవహరించాలని సీనియర్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటు మొబైల్, కెమెరా, సీసీటీవీల ద్వారా హింసకు పాల్పడే వారిపై డిజిటల్ ఆధారాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు.
పంజాబ్లోని అన్ని ప్రధాన సైనిక కోచింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. హరియాణాలో కూడా పోలీసులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆదివారం ఫరీదాబాద్లో రెండు వేలకు పైగా పోలీసులను మెహరించారు. ఝార్ఖండ్లో అన్ని పాఠశాలలను మూసివేశారు అధికారులు. విద్యార్థుల భద్రత దృష్ట్యా మూసివేసిన్నట్లు ఝార్ఖండ్ విద్యాశాఖ అధికారి తెలిపారు. బంగాల్, బిహార్లో పోలీసులు మోహరించారు. హౌరా రైల్వే స్టేషన్, షాలిమార్ స్టేషన్, హవుడా బ్రిడ్జి వద్ద భారీగా పోలీసులను మొహరించారు. బిహార్లోని పట్నాలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అలాగే దేశంలో ప్రధాన పట్టణాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి చర్యలు తీసుకున్నారు. 35 వాట్సాప్ గ్రూప్లను బ్యాన్ చేసినట్టు తెలుస్తోంది.
Source: EtvBharat





