
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సెల్యూట్ చేస్తున్నామని, వివిధ పథకాల ద్వారా మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తూనే ఉంటుందని అన్నారు. మహిళలకు గౌరవం, అవకాశాల కల్పనకు చేస్తున్న కృషి కొనసాగుతుందని మంగళవారంనాడు వరుస ట్వీట్లలో ఆయన పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళలను ముందువరుసలోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
”ఆర్థిక స్వావలంబన నుంచి సామాజిక భద్రత వరకు, నాణ్యమైన హెల్త్కేర్ నుంచి హౌసింగ్ వరకూ, విద్య నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేంత వరకూ మన నారీశక్తిని భారత అభివృద్ధి యాత్రలో అగ్రభాగాన నిలిపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత పట్టుదలతో ఈ ప్రయత్నాలను ముందుకు తీసుకు వెళ్తాం” అని మోదీ పేర్కొన్నారు.





