
ముంబై: దావూద్ ఇబ్రహీంపై ఉన్న మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో ముంబైలో ఈడీ అధికారులు మంగళవారం పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. పరారీలో ఉన్న దావూద్పై మనీలాండరింగ్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్న తన లింక్స్ తో అండర్ వరల్డ్ ను శాసిస్తూ వస్తున్నాడు.
దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్, సోదరుడు ఇక్బాల్ కస్కర్, గ్యాంగ్స్టర్ చోటా షకీల్ బావమరిది ఇళ్ళపై ఈడీ అధికారులు దాడులు చేశారు. మనీ లాండరింగ్, హవాలా, అక్రమ ఆస్తి లావాదేవీల వ్యవహారంలో భాగంగా ముంబైలోని పలు చోట్ల ఈ సోదాలు నిర్వహించారు.
ఈడీ దాడుల్లో మహారాష్ట్రకు చెందిన ఓ రాజకీయ నాయకుడు కూడా ఉన్నారు. అండర్ వరల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు సంబంధించి ఈడీ ముంబైలో ఒకరిని అదుపులోకి తీసుకుంది. ముంబై, దుబాయ్లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొందరు వ్యాపారుల అక్రమ ఆస్తి లావాదేవీలు, దౌర్జన్యంగా డబ్బు వసూలు చేసిన వ్యవహారాలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ముంబై పేలుళ్ల సూత్రధారి, పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించి కొన్ని నిఘా సంస్థలకు ఇన్పుట్లు అందాయని తెలుస్తోంది. ముంబయి అండర్వరల్డ్తో ముడిపడి ఉన్న హవాలా, దోపిడీ, అక్రమ ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసం మనీలాండరింగ్ నిరోధక సంస్థ వెతుకుతోంది.
Source: NationalistHub





