
-
ముస్లిం వస్త్రధారణను అనుమతిస్తే… మేము కండువాలు ధరించి వస్తాం
-
అనుమతించండని హిందూ విద్యార్థుల డిమాండ్
కర్ణాటక: కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి వస్తుండడంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. తాజాగా ముస్లిం యువతులను మరో కళాశాల సిబ్బంది గేటు వద్దే అడ్డగించారు. ఉడిపిలోని కుందాపూర్లోని మరో కళాశాలలో విద్యార్థినులు హిజాబ్ ధరించి కాలేజీకి వచ్చారు.
విద్యార్థినులు కళాశాల గేటు వద్దే అడ్డుకున్న సిబ్బంది.. ప్రభుత్వం జారీ చేసిన డ్రెస్కోడ్ ప్రకారం హిజాబ్లు ధరించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కళాశాల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎంతకీ లోపలికి అనుమతించకపోవడంతో అక్కడే ఆందోళనకు దిగారు.
హిజాబ్ ధరించిన విద్యార్ధినులు కళాశాలలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సందర్భంలో కొంతమంది హిందు విద్యార్థులు కాషాయ శాలువాలు ధరించి ఆందోళనకు దిగారు. హిజాబ్కు అనుమతిస్తే కాషాయ శాలువాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పోలీసు సిబ్బంది బాలికల తల్లిదండ్రులను వెనక్కి పంపించారు. ఇదిలావుండగా, ఉడిపిలోనే మరో కళాశాలలోనూ హిజాబ్ ధరించి వచ్చిన 28 మంది విద్యార్థినులను అధికారులు లోపలికి అనుమతించలేదు.
బాలికలు తరగతుల వెలుపల నిరసన తెలిపారు. క్లాస్రూమ్లలోకి హిజాబ్లు ధరించి వస్తామన్న అమ్మాయిల డిమాండ్ను వ్యతిరేకిస్తూ 100 మంది హిందూ విద్యార్థులు కాషాయ శాలువాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.





