
బాసర: ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జాము ఒంటిగంటన్నర గంటలకు మంగళవాయిద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి చండీవాహనం, వేదపారాయణంతో పాటు మహా పూజలు నిర్వహిస్తున్నారు. కాగా, జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.
సుదూర ప్రాంతాలకు అర్ధరాత్రే బాసరకు చేరుకున్న భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక అమ్మవారి చెంత అక్షరాభ్యాసం చేయిస్తే విద్యాబుద్ధులు దండిగా ఉంటాయని భక్తుల అపారనమ్మకం. ఇందులో భాగంగా అక్షర శ్రీకార మండపంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఉదయం నాలుగు గంటలకే ప్రారంభమయ్యాయి. కాగా, అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో బాసర వాగ్దేవి.. సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది.





