
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్లో మనం కొత్త తరహా యుద్ధాలను ఎదుర్కోవాల్సి ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె చెప్పారు. వాటి తాలూకు ట్రైలర్లు ఐటీ, ఎకనామిక్, సైబర్ వార్ఫేర్ వంటి రూపాల్లో ఇప్పటికే కళ్లముందు కన్పిస్తున్నాయని తెలిపారు. అణు పాటవమున్న పొరుగు దేశాలు, వాటి దన్నుతో ఉగ్ర మూకలు చేస్తున్న పరోక్ష యుద్ధం దేశ భద్రతకు ముందెన్నడూ లేనంతగా సవాళ్ళు విసురుతున్నాయని చైనా, పాకిస్తాన్లను ఉద్దేశించి హెచ్చరించారు.
‘‘యుద్ధ స్వరూపంలో వస్తున్న ఈ సమూల మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టగలగడం, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనే సన్నద్ధత ముఖ్యం. ఈ దిశగా మన ప్రత్యక్ష, పరోక్ష యుద్ధ పాటవాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి’’ అని సూచించారు. సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ (సీఎల్ఏడబ్ల్యూఎస్) ఏర్పాటు చేసిన సెమినార్లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధురి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్లతో పాటు నరవణె పాల్గొన్నారు.





