
-
సుంకం తగ్గించిన కేంద్రం
న్యూఢిల్లీ: వంట నూనెల ధరలు అదుపు చేసేందుకు ప్రభుత్వం రిఫైన్డ్ పామాయిల్పై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని(బీసీడీ) 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. 2022 మార్చి వరకు ఇది అమల్లో ఉంటుంది. ఈ చర్య వల్ల దేశీయ విపణిలో సరఫరా పెరిగి, ధరలు తగ్గుతాయి. బీసీడీ తగ్గింపు వల్ల రిఫైన్డ్ పామాయిల్, రిఫైన్డ్ పామోలిన్లపై మొత్తం సుంకం 19.25 శాతం నుంచి 13.75 శాతానికి తగ్గనుందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) పేర్కొంది.
కొత్త రేటు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వశాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. సోమవారం కిలో వేరుసెనగ నూనె ధర రూ.181.48; ఆవాల నూనె రూ.187.43; వనస్పతి రూ.138.5; సోయాబీన్ నూనె రూ.150.78; పొద్దుతిరుగుడుపువ్వు నూనె రూ.163.18, పామాయిల్ రూ.129.94గా ఉన్నాయి. శుద్ధి చేసిన పామాయిల్ను లైసెన్సు లేకుండా 2022 డిసెంబరు వరకు దిగుమతి చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.





