
భోపాల్: యూపీఏ హయాంలో భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ను చిత్రహింసలకు గురిచేసి, ఆమెతో ‘కాషాయ ఉగ్రవాదం’ గురించి ఒప్పించాలని విఫల ప్రయత్నం చేసిన వివాదాస్పద పోలీస్ అధికారి, మాజీ పోలీసు కమిషనర్ పరమ్బీర్ సింగ్ అదృశ్యమయ్యారు. ఈ మేరకు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే తెలిపారు. సింగ్ రష్యాకు పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయని వెల్లడిరచారు.
ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న కారు నిలిపి ఉంచిన కేసులో అరెస్టయిన సచిన్ వాజేతో సింగ్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దోపిడీ కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొంటున్న పరంబీర్ సింగ్ దేశం విడిచి వెళ్లిపోవచ్చనే ఊహాగానాల మధ్య ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని దిలీప్ వాల్సే పాటిల్ తెలిపారు.
ఆయనపై ఉన్న అభియోగాల విచారణ కోసం ఏర్పాటు చేసిన చందీవాల్ కమిషన్ ఎదుట హాజరు కావాలని పరంబీర్ సింగ్పై లుకౌట్ నోటీసులు కూడా జారీచేశామని చెప్పారు. ‘ఒకవేళ పరంబీర్ గనుక దేశం నుంచి వెళ్లిపోతే.. అది ఎంతమాత్రం మంచిది కాదు’ అని హెచ్చరించారు. మంత్రి అయినా, సీనియర్ అధికారి అయినా, ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం కోసం పనిచేసే వారు కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి తెలియజేయకుండా వీరెవరూ దేశం నుంచి విడిచి వెళ్లకూడదని, ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు.
పరంబీర్పై ఏవిధమైన చర్యలు తీసుకుంటారని మీడియా అడిగిన ప్రశ్నక మంత్రి పాటిల్ స్పందిస్తూ.. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతానికి ఆయన కోసం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెతుకుతోందని, గుర్తించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
కొద్దీ నెలల కిందట పోలీస్ కమిషనర్గా హోమ్ గార్డ్ విభాగానికి బదిలీ అయ్యాక అప్పటి హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ .. హోటల్, బార్ యజమానులు నుండి ముడుపులు వసూలు చేయమని పోలీస్ అధికారులను ఆదేశించారని సంచలన ఆరోపణ చేశారు. ఆ ఆరోపణపై సిబిఐ దర్యాప్తు చేపట్టడంతో దేశముఖ్ హోమ్ మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది.
కనీసం నాలుగు దోపిడీ కేసులలో నిందితుడిగా ఉన్న పరమ్బీర్ సింగ్ను మరొకొందరు పోలీస్ అధికారులతో పాటు సస్పెండ్ చేయమని మహారాష్ట్ర పోలీస్ విభాగం అధిపతి సంజయ్ పాండే ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గతంలో ఎటిఎస్ అదనపు కమిషనర్గా, ప్రస్తుత భోపాల్ ఎంపీ ప్రజ్ఞాఠాకూర్ను నిర్బంధంలో ‘కాషాయ ఉగ్రవాదం’ ఆరోపణలను ఒప్పుకోమని వేధిస్తూ చిత్రహింసలకు గురిచేశారని తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్నారు.
తనను సింగ్, మరి కొందరు పోలీస్ అధికారులు 13 రోజులపాటు అక్రమ నిర్బంధంలో ఉంచి, చిత్రహింసలకు గురిచేశారని ఆమె ఆరోపించారు. స్వతంత్ర భారత దేశంలో పోలీసులు ఒక మహిళను ఆ విధంగా చిత్రహింసలకు గురిచేసిన సందర్భాలు లేవని ఆమె పేర్కొన్నారు. 2009లో ముంబైలో ఉగ్రదాడి అనంతరం పరంబీర్, మరో ముగ్గురు పోలీస్ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించారంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. వారు అప్పటి పోలీస్ కమిషనర్ ఆదేశాలను పాటించలేదంటూ పిల్ దాఖలయింది.
ఉన్నతాధికారుల ఆదేశాలను ఖాతరు చేయకుండా, సురక్షిత ప్రాంతాలకు వెళ్లి కంట్రోల్ రూమ్లకు తప్పుడు సందేశాలు పంపారని అంటూ అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ హాసన్ గఫార్ ఆరోపించారు. 2009లోనే సలీల్ చతుర్వేది అనే వ్యాపారిపై అక్రమంగా డ్రగ్ కేసు నమోదు చేసి, పశ్చిమ డిసిపిగా అరెస్ట్ చేసిన్నట్టు ఆరోపణలున్నాయి. అతని ఆదేశంపై కొందరు పోలీస్ అధికారులు అతని ఇంట్లో మాదకద్రవ్యాలను సృష్టించారని కూడా సిఐడి విచారణలో తేలింది.
గత ఫిబ్రవరిలో నగర పోలీస్ కమిషనర్గా నియమించడానికి ముందు ఎసిబి డైరెక్టర్ జనరల్గా వ్యవరించారు. అప్పటి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్కు సాగునీటి కుంభకోణంలో క్లీన్ చిట్ ఇచ్చి వివాదాస్పదం అయ్యారు. గత ఏడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ అనుమానాస్పద మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ ప్రకటించాడు. అయితే, అది వాస్తవం కాదని తేలిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను అవమానించేవిధంగా ట్వీట్ చేసిన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Source: Nijamtoday





