
జమ్ముకశ్మీర్లో విధ్వంసం సృష్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ముష్కరమూకలు. ఒకవైపు డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తున్నారు. మరోవైపు జవాన్ల పైకి కాల్పులకూ తెగబడుతున్నారు. కొద్దిరోజులుగా డ్రోన్ల కలకలం.. వారం రోజులుగా డ్రోన్ దాడులకు విఫలయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్లోని సరిహద్దుల వెంట ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. అర్నియా సెక్టార్లో డ్రోన్ను గుర్తించిన భద్రతా బలగాలు అప్రమత్తమయ్యారు. బుధవారం తెల్లవారుజామున పాక్ నుంచి భారత్వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో డ్రోన్ వెనక్కు మళ్ళింది.
ఇదిలావుంటే జమ్ము కశ్మీరులోని పుల్వామా జిల్లా కేంద్రంలో కాల్పుల మోత మొగుతోంది. బుధవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ మొదలైంది. ఈ దాడిలో పాల్గొన్నవారు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా అధికారులు అనుమానిస్తున్నారు.





