
పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో ఇద్దరు మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం అదుపులోకి తీసుకుంది. వీరితో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, కోల్కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలోని కూడా సీబీఐ కార్యాలయానికి తరలించింది.
ఈ ఉదయం 8 గంటల ప్రాంతంలో సీబీఐ అధికారులు మంత్రి ఫిర్హాద్ హకీం నివాసానికి చేరుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రశ్నించిన అనంతరం ఆయనను సీబీఐ కార్యాలయానికి తరలించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తనను సీబీఐ అరెస్టు చేసిందని ఫిర్హాద్ ఆరోపించారు. దీనిపై తాను కోర్టుకు వెళ్తానని తెలిపారు. అయితే మంత్రి ఆరోపణలను దర్యాప్తు సంస్థ కొట్టిపారేసింది. అవినీతి కేసులో విచారణ నిమిత్తమే వీరిని తీసుకెళ్లినట్లు తెలిపింది. నారదా కేసులో ఈ నలుగురిపై సీబీఐ దర్యాప్తునకు గవర్నర్ జగదీప్ ధనకర్ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.
2014లో నారదా టేపుల విడుదల సమయంలో వీరంతా మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. దిల్లీకి చెందిన ఓ జర్నలిస్టు తృణమూల్ నేతలపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించడం అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అందులో ఏడుగురు తృణమూల్ ఎంపీలు, నలుగురు మంత్రులు, ఒక ఎమ్మెల్యే, పోలీసు అధికారికి నగదు తీసుకుంటూ కెమెరాకు చిక్కారు. 2016 ఎన్నికల ముందు ఈ వీడియోలు రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ కేసులో సువేందు అధికారిపైనా అభియోగాలున్నాయి. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేసేందుకు 2017లో కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీరిపై సీబీఐ కేసు నమోదు చేసింది.





