
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2022 ఆగస్టు 15 కి 75 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా మార్చి6వ తేదీ నాడు 259 సభ్యులతోకూడిన ఒక కమిటీని కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వతంత్రపోరాటంలో మైలు రాయిగా నిలిచిన ఉప్పు సత్యాగ్రహం జరిగి 91 సంవత్సరాలు పూర్తయిన రోజున అంటే 12 మార్చ్ 2021 న లాంఛనంగా కార్యక్రమాలు ప్రారంభించాలని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నది. ఈ కమిటీలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు, ప్రముఖ కళాకారులు, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బొబ్దే మరియు అజిత్ ధోవల్, 28 మంది ముఖ్యమంత్రులు, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ , మాజీ కేంద్రమంత్రి బిజెపి సీనియర్ నాయకుడు శ్రీ ఎల్ కే అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, హెచ్.డి.దేవెగౌడ, కాంగ్రెస్ చీఫ్ సోనియా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ములాయం సింగ్, శరద్ పవార్ లాంటి అనేకమంది ప్రముఖులు ఈ కమిటీలో ఉన్నారు. ఈ కమిటీకి ప్రధాని మోడీ నాయకత్వం వహిస్తారు
ఈరోజు అంటే 2021 మార్చ్ 8న ఈ రెండు వందల యాభై తొమ్మిది మంది కమిటీ సభ్యులతో మొదటి సమావేశం ఢిల్లీలో జరుగుతున్నది, ఆ సమావేశానంతరం భవిష్యత్ కార్యక్రమాలను ప్రకటిస్తారు .





