
దేశ సరిహద్దులను పరిరక్షించడంలో ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటామని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అన్నారు. తూర్పు లడ్డాఖ్ వద్ద భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో రావత్ ఈ ప్రకటన చేశారు. జీఆర్ఎస్ఈ యార్డ్ నుంచి మొదటి ఫ్రిగేట్ వార్షిప్ను ప్రారంభించిన సందర్భంగా రావత్ మాట్లాడుతూ..రక్షణరంగంలో సాంకేతికత ప్రాముఖ్యతను ప్రస్తావించారు.
‘కొవిడ్-19 మహమ్మారి విజృంభణ తరుణంలో తూర్పు లడ్డాఖ్ వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి యదాతథ స్థితిని మార్చడానికి చైనా చేసిన ప్రయత్నాల వల్ల భూమి, సముద్రం, ఆకాశ మార్గాల్లో అప్రమత్తత అవసరమైంది. మన సరిహద్దులను రక్షించడంలో భద్రతాబలగాలు ఎటువంటి సవాళ్లనయినా ఎదుర్కొంటాయి. భారత్లో తయారీకి ప్రాధాన్యత లభిస్తోంది. భారీ రక్షణ ఒప్పందాలను కుదుర్చుకోవడంపై ఆత్మనిర్భర్ భారత్ దృష్టి సారించింది’ అని రావత్ వెల్లడించారు. చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నందున 15 రోజుల తీవ్ర యుద్ధానికి సరిపడా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వ చేసేందుకు రక్షణ దళాలకు అధికారం ఇచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.





