
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ “లవ్ జిహాద్” కు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించిన ఒక రోజు తరువాత, హర్యానా ముఖ్యమంత్రి మనోహార్ లాల్ ఖట్జర్ లవ్ జిహాద్కు వ్యతిరేకంగా రాష్ట్రంలో చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “హిందూ మహిళలను కొంత మంది ముస్లిం యువకులు ప్రేమ పేరుతో మోసం చేసి ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి రాష్ట్రంలో లవ్ జిహద్కు వ్యతిరేకంగా ఒక చట్టాన్నితీసుకురావాలని మా ప్రభుత్వం యోచిస్తోంది.” అన్నారు.

గత వారం ఫరీదాబాద్ బల్లభ నగర్లో 21 ఏళ్ల కళాశాల విద్యార్థిని తన ప్రేమను అంగీకరించటం లేదనే అక్కసుతో గతంలో ఆమె క్లాస్మేట్ అయిన ఒక ముస్లిం యువకుడు ఆమెను హత్య చేయడంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో…. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తోంది. హర్యానా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్నాల్లో మాట్లాడిన ఖట్జర్, “బాలిక హత్య లవ్ జిహాద్తో ముడిపడి ఉంది అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిశీలస్తున్నాయని” తెలిపారు.
బలవంతపు మతమార్పిడులు పునరావృతం కాకుండా, బల్లభ నగర్లో జరిగిన హత్యల వంటి చర్యలను నివారించడానికి చేయాల్సిన చట్టాల పరిధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ న్యాయ సలహాలను పరిగణలోకి తీసుకోనున్నట్టు సీఎం తెలిపారు. దోషులు తప్పించుకోకుండా, అమాయకులకు శిక్ష పడకుండా ఉండేలా చట్టాన్ని రూపొందించటానికి వీలుగా చట్టపరమైన నిబంధనలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.





