
ఈ రోజు వేకువ ఝామున, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు ఆయన నివాసంలో అరెస్టు చేశారు. సమాచారం ప్రకారం, అప్పటికే మూసివేయబడిన 2018 నాటి ఓ ఆత్మహత్య కేసులో అర్నాబ్ను అరెస్టు చేశారు. 2018లో కాన్కార్డ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఆర్నాబ్ పై ఐపీసీ సెక్షన్ 306, 34 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఎమెర్జెన్సీ రోజులను తలపిస్తున్నారు – అమిత్ షా :

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేయడాన్ని హోంమంత్రి అమిత్ షా బుధవారం ఖండించారు. “ఇది అత్యవసర పరిస్థితిని గుర్తుచేస్తోంది. పత్రికా స్వేచ్చపై దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.” అని ఆయన పేర్కొన్నారు.
ముంబై పోలీసుల ఈ చర్య ఇందిరా గాంధీ విధించిన ఎమెర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని అమిత్ షా అన్నారు. “కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ప్రజాస్వామ్యాన్ని మరోసారి అపహాస్యం చేస్తున్నాయి” అని ఆయన ట్వీట్ చేశారు.
“ఈ చర్య రిపబ్లిక్ టీవీ మరియు అర్నాబ్ గోస్వామిలకు వ్యతిరేకంగా రాష్ట్ర అధికార దుర్వినియోగం, వ్యక్తిగత స్వేచ్ఛపైన, ప్రజాస్వామ్యం యొక్క 4 వ స్తంభంపైన దాడి.” అని ఆయన ట్వీట్ చేశారు.
తనపైన, తన కుటుంబ సభ్యులపైన పోలీసులు భౌతిక దాడులు చేశారని అర్నాబ్ ఆరోపించారు. “వారు [ముంబై పోలీసులు] దాడి చేసి నన్ను కొట్టారు, నా కొడుకును కొట్టారు, నా కుటుంబ సభ్యులను కలవడానికి నన్ను అనుమతించలేదు.” అని అర్నాబ్ ఆవేదన వ్యక్తం చేశారు.





