
బాలికా విద్య నుంచి గంగా నదిని ప్రక్షాళన కార్యక్రమం వరకు వివిధ ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రధాని మోదీ తన వ్యక్తిగత సహాయాన్ని అందిస్తూనే ఉంటారు. కాగా ఈ విధంగా ప్రధాని ఇచ్చిన విరాళాల మొత్తం రూ.103 కోట్లకు పైమాటే అని తెలిసింది. ఈ క్రమంతో ‘పీఎం కేర్స్ నిధి’ ఏర్పాటుచేసిన తొలినాళ్లలో మోదీ రూ.2.25లక్షలను అందచేసినట్టు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కట్టడికై ఉద్దేశించిన ఈ నిధిని మార్చి 27న ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా.. గత సంవత్సరం ఉత్తర్ ప్రదేశ్లో జరిగిన కుంభమేళాలో విధులు నిర్వహించిన పారిశుధ్య సిబ్బంది సంక్షేమం కోసం మోదీ రూ.21 లక్షలు విరాళం ఇచ్చారు. దక్షణ కొరియా అందించే సియోల్ శాంతి బహుమతి ద్వారా లభించిన రూ.1.3 లక్షల బహుమతి మొత్తాన్ని గంగా నది ప్రక్షాళన కార్యక్రమం ‘నమామి గంగే మిషన్’కు విరాళంగా అందచేశారు. అంతేకాకుండా తనకు లభించిన మెమెంటోలు, తదితర వస్తువులను వేలం వేయగా వచ్చిన మరో రూ.3.40 కోట్ల మొత్తాన్ని కూడా ఈ కార్యక్రమానికే అందచేశారు. 2015లో తనకు లభించిన వివిధ బహుమతులను వేలం వేయగా వచ్చిన రూ.8.35 కోట్లను నమామి గంగే మిషన్కు ఇచ్చారు. ఈ విధంగా వివిధ సందర్భాల్లో ఆయన ఇచ్చిన విరాళాలు మోత్తం రూ.103 కోట్ల పైమాటే అని తెలిసింది.
ఇదిలా ఉండగా.. అసలు పీఎం కేర్స్ నిధి చట్టబద్ధతపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు లేవనెత్తింది. ప్రధానమంత్రి జాతీయ సహాయక నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) ఉండగా మరో నిధి ఎందుకని కూడా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పర్చిన ఇతర సహాయక నిధులు బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడి ఉండగా… పీఎం కేర్స్ నిధి ప్రజలు తమంతట తామే ఇచ్చే విరాళాలతో నడుస్తుందని కేంద్రం వివరించింది. కాగా, ఇటీవల పీఎం కేర్స్ వెబ్సైట్లో ప్రకటించిన ఆడిట్ వివరాల ప్రకారం .. ఈ నిధికి రూ.3,075.85 కోట్లు దేశీయ విరాళాలు కాగా.. విదేశీ విరాళాలు రూ. 39.67 లక్షల మేరకు లభించాయని తెలుస్తోంది. సదరు నిధి ఖాతాలో ప్రస్తుతం రూ. 30,76,62,58,096 మొత్తం నిల్వ ఉన్నట్టు వెబ్సైట్ గణాంకాలు తెలుపుతున్నాయి. పీఎం కేర్స్కు చైనా నుంచి విరాళాలు అందాయని… విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు ఎందుకు బహర్గతం చేయటం లేదని కాంగ్రెస్ నేత చిదంబరం తదితరులు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడి కావటం గమనార్హం.





