
భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు చెందిన మిగ్- 27 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. పంజాబ్లోని నవాన్షహార్ సమీపంలో ఉదయం 10.30గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చౌహారాపూర్ గ్రామంలో నిర్మానుష్య ప్రదేశంలో ఈ జెట్ కూలిపోవడంతో అక్కడ మంటలు చెలరేగినట్టు అధికారులు వెల్లడించారు. జలంధర్ సమీపంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమం నేపథ్యంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఐఏఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఈ ఘటనలో పైలట్ను హెలికాఫ్టర్ ద్వారా కాపాడినట్టు తెలిపారు. సాంకేతిక లోపం తలెత్తడంతో జెట్ను పైలట్ అదుపుచేయలేకపోయారనీ.. ఈ మిగ్ – 29 కూలిపోవడానికి ముందే పైలట్ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న స్థానిక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పైలట్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఐఏఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.





