
ఓ వైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో తిరుగులేని పోరాటం చేస్తుంటే పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. వీరిలో ఓ మేజర్, కల్నల్ స్థాయి సైనికాధికారులు కూడా ఉన్నారు. నార్త్ కశ్మీర్లోని హంద్వారా ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు, ముష్కరులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఇంట్లో ముష్కరులు బందీలుగా చేసుకున్న కొంత మంది పౌరులను రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా సైనికులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. భద్రతా దళాల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆర్మీ బృందానికి నాయకత్వం వహిస్తున్న కల్నల్ అశుతోష్ శర్మ, ఓ మేజర్ అమరులయ్యారు. అశుతోష్ శర్మ 21 రాష్ట్రీయ రైఫిల్స్కు కమాండింగ్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు ఓ ఎస్సై, ఇద్దరు సైనికులు కూడా వీరమరణం పొందారు. ఎట్టకేలకు పౌరుల్ని మాత్రం సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చారు.




