
705views
33 ఏళ్ల తర్వాత కూడా రామానంద్ సాగర్ ‘రామాయణం’ ధారావాహిక తన సత్తా చాటుతోంది. భారత టెలివిజన్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ బుల్లి తెర సీరియల్ ప్రపంచంలోనే అత్యధిక మంది వీక్షించిన కార్యక్రమంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మేరకు దూరదర్శన్ తాజాగా ట్విటర్లో పేర్కొంది. ఏప్రిల్ 16న ఈ సీరియల్ను ప్రపంచవ్యాప్తంగా 7.7 కోట్ల మంది వీక్షించారని వెల్లడించింది. ఇంత మంది వీక్షించడం ప్రపంచ రికార్డని తెలిపింది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ప్రజల వినోదం కోసం ఈ ధారావాహికను పునఃప్రసారం చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో మార్చి 28 నుంచి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇది ప్రేక్షకులను అలరిస్తోంది.





